ఏపీ భాజాపా అధ్యక్షపదవికి ఎంపీ కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా అధ్యక్ష మార్పుపై వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో సొంతంగా భాజాపా ఎదగడానికి ప్రణాలికలో భాగంగానే హరిబాబు స్థానంలో కొత్త వారిని నియమించబోతున్నారు. రాష్ట్ర ఇన్చార్జ్గా బాధ్యలు రామ్మాధవ్ తీసుకున్న తర్వాత పార్టీలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీనిలో భాగంగానే హరిబాబును రాజీనామా చేయించింది అధిష్టానం.
హరిబాబు రాజీనామాపై భాజాపా ఫ్లోర్లీడర్ విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఆయన పదవీ కాలం పూర్తి అయినందునే పార్టీ నియమాలకు కట్టుబడి రాజీనామా చేశారని ఆయన అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. ఆయన సమర్థవంతుడైన నాయకుడని, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని తాము కోరుతున్నామని తెలిపారు. గతంలోనూ పార్టీ పెద్దలతో హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ప్రస్తావించామని, ఆయన రాజీనామాతో విశాఖ రైల్వే జోన్ కు ఎటువంటి ఢోకా ఉండదని అన్నారు. కచ్చితంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని తెలిపారు.