టీడీపీ, భాజాపా మధ్య గత వారం రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు పొత్తుపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా.. బీజేపీతో తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, మిత్రపక్ష ధర్మం పట్ల బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తాను తమ నేతలను చాలా వరకు నియంత్రిస్తున్నానని అన్నారు.
వారం రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీని రాష్ట్రంలో నామరూపం లేకుండా చేయాలని టీడీపీ చూస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలు చేశారు.
చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నేతలు గత కొంతకాలంగా గళమెత్తుతున్నారు. వీటిపై నేరుగా స్పందించని ముఖ్యమంత్రి ‘బంధం’లో ఉండాలనుకుంటున్నారో? తెంచుకోవాలనుకుంటున్నారో? ఆలోచించుకోవాలని నర్మగర్భంగా మాట్లాడారు. బాబు చేసిన వ్యాఖ్యల పట్లు భాజాపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.