తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవికాలాన్ని ఆ పార్టీ అధిష్టానం పోడిగించింది. మార్చి 11తో ఆయన పదవి కాలం ముగుస్తుండటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు 2024లో జరుగుతాయన్న తరుణ్ చుగ్.. అప్పటి వరకు అధ్యక్షుడిగా బండి సంజయ్ని కొనసాగించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిపారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ మొదటి నుంచి రాష్ట్రంలో పార్టీ భలోపేతానికి కృషి చేస్తున్నారు. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో ఎన్నడూ లేని విధంగా కార్పోరేట్ సిట్లను దక్కించుకుంది. దీంతో పాటు హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది.
అంతే కాకుండా పార్టీ బలోపేతం కోసం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. దీంతో బీజేపీ సిద్దంతాలను బండి సంజయ్ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ఢిల్లీ పెద్దలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యమ్నాయంగా బీజేపే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.