ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు త్వరలోనే బీజేపీకి టాటా చెప్పబోతున్నారని చాలా రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. దీనికి బలం చేకూర్చేలానే ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుకు ఏ పార్టీనైనా ముందుకు వస్తుందా? ఫించన్ల పెంపు టీడీపీకి మైలేజ్ ఇచ్చే అంశమంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఫించన్ల పెంపు – డ్వాక్రా మహిళలకు సాయం వంటి అంశాలతో టీడీపీకి సానుకూలత పెరిగిందని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగితే ఇంత అనుమానాలు వచ్చి ఉండేవి కావు.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తాననేది నోటిఫికేషన్ వచ్చాకే చెబుతానని విష్ణుకుమార్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి. ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని ఇప్పుడే చెప్పేస్తే.. సరైన కవరేజ్ రాదని కామెంట్ కూడా చేశారు.
దీనిని బట్టి విష్ణకుమార్ రాజు బీజేపీకి రాజీనామా చేసే అవకాశం కన్ఫామ్ అయినట్టే కనిపిస్తోంది. కానీ ఏ పార్టీలో చెరతారనేదే సందేహం. చంద్రబాబు ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి అనుకూలంగా మారాయని.. ఏపీలో రాజకీయ పరిస్థితిని మార్చేశాయన్న వ్యాఖ్యలు చూస్తుంటే రాజుగారు సైకిల్ పార్టీలో చేరుతారేమో అన్న కొత్త చర్చ తెరపైకి వచ్చింది.