తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. గత కొంత కాలంగా రెండు మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలసిందే. ప్రత్యేకహోదాకోసం వైసీపీ ఢిల్లీలో చేపట్టిన ధర్నాతో టీడీపీ,భాజాపా మధ్య మాటయుద్ధం మరింత ముదిరింది.
టీడీపీ మిత్రధర్మాన్ని విస్మరిస్తూ, అనైతిక చర్యలకు పాల్పడుతోందని అన్నారు. వైసీపీ, కాంగ్రెస్ లతో కలసి బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీని నాశనం చేసేందుకు టీడీపీ యత్నిస్తోందని అన్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల ట్రాప్ లో టీడీపీ పడిందని చెప్పారు.
మోదీ మెడలు వంచాలంటూ టీడీపీ నేతలు అంటున్నారని… గాలేరు-నగరిని పూర్తి చేయనందుకు ఎవరి మెడలు వంచాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రజల కోసం ఎన్నో చేస్తున్న బీజేపీని నిందిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో ఆయన ప్రస్తావించిన అన్ని అభివృద్ధి పనులు బీజేపీవే అని అన్నారు.
టీడీపీ ఇన్ని చేస్తున్నా తాము మిత్రధర్మానికి కట్టుబడి ఉన్నామని… ఇప్పటి వరకు తాము కొన్ని విషయాల గురించే మాట్లాడామని, అన్ని విషయాల గురించే మాట్లాడే పరిస్థితే వస్తే… ఏమవుతుందో ఆలోచించండని చెప్పారు. ఎంగిలి కాఫీలు తాగే అలవాటు బీజేపీకి లేదని అన్నారు.