చంద్రబాబు ఏతప్పు చేయకుంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని భాజాపా నాయకులు విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కుంభకోణాలు చోటుచేసుకున్నాయని నేతలు ఆరోపిస్తున్నారు. బాబు ప్రభుత్వంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్రెడ్డి లు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులోని అంశాలపై 40 నిమిషాల పాటు చర్చించారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా 54 వేల పీడీ అకౌంట్లను తెరిచి, భారీ ఎత్తున నిధులను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. అమరావతి బాండ్ల పేరిట నిధుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు.
పీడీ అకౌంట్ల విషయంలో ప్రభుత్వ అవినీతి వెలికి తీసేవరకు వదిలిపెట్టమని హెచ్చరించారు నేతలు. పీడీ అకౌంట్లపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడితో సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పీడీ అకౌంట్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. పీడీ అకౌంట్లపై ఆర్థిక మంత్రి యనమల సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఎక్కువ అప్పులు తెచ్చుకుని, ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.