వైసీపీ ప్రధాన అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. వైసీపీ బలంగా ఉన్న చోట్ల టీడీపీ తరుపున ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు. మరో సారి అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కృష్ణా జిల్లాలో తొలి టికెట్ను ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్కు పార్టీ అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. ఇదే ఊపులో రెండు మూడు రోజుల్లో జిల్లాలో పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ టికెట్ను ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది.
2019 ఎన్నికల్లో మరో సారి అధికారంలోకి రావాలని బాబు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. ఇప్పటికే వైసీపీలోని కొంతమంది నాయకులను గుర్తించి వారి ఓడించేందుకు ప్లాన్ చేస్తున్న చంద్రబాబు…. తాజాగా ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొత్తం తొమ్మిది సార్లు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా రెండుసార్లు మినహా మిగిలిన అన్ని సార్లు టీడీపీ జెండానే ఎగిరింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కొడాలి నాని విజయం సాధించారు. ఈసారి నానిని ఓడించేందుకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపుతున్నారు బాబు.
నానికి చెక్ పెట్టేందుకు ఈ సారి రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్ పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేయడంలో నాని వైసీపీ అధినేత జగన్ కన్నా దూకుడు ప్రదర్శిస్తుంటారు. టీడీపీకి కొరకారి కొయ్యగా మారిన నాని దూకుడుకు చెక్ పెట్టాలని టీడీపీ అధిష్ఠానం యోచిస్తోంది.
నియోజకవర్గంలో ఇప్పటికే పలుమార్లు నిర్వహించిన సర్వేలు రావికి సానుకూలంగా ఉన్నా ఆయన ఎంత వరకు నానిని ధీటుగా ఎదుర్కొనగలరన్న అంశాన్ని పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నాయి. మరో వైపు యువకుడైన అవినాష్ను గుడివాడ నుంచి బరిలోకి దింపితే కొడాలి నానికి చెక్ పెట్టొచ్చని టీడీపీ అధినేత భావిస్తున్నారని తెలుస్తోంది. గుడివాడ నుంచి ఆయనను బరిలోకి దింపితే కొడాలి నాని దూకుడుకు కళ్లెం వేయొచ్చని అనుకుంటున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో గుడివాడ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాని దూకుడుకు బాబు కళ్లేం వేస్తారో లేదో చూడాలి.