టీడీపీ, పవన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నిన్నటి వరకు టీడీపీ నేతలు పవన్ను విమర్శిస్తే ఇప్పుడు చంద్రబాబుకూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా పోలవరంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ప్రాజెక్టులను అడ్డుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందని, ఇప్పుడు ఆకోవలో జనసే చేరిందన్నారు. పూర్తి పారదర్శకతతో సాగుతున్న పోలవరం పనుల్లో అవినీతిపై పవన్ వద్ద ఏ ఆధారాలు ఉన్నాయని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు.
పవన్కు ధైర్యంఉంటే ఒక్క ఆధారాన్నైనా బయటపెట్టాలని సవాల్ విసిరారు. భుత్వంపై ఉద్దేశ పూర్వకంగానే బురదజల్లే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేతల ప్రోద్బలంతోనే పవన్ రెచ్చిపోతున్నారని కచ్చితంగా చెప్పగలనని వ్యాఖ్యానించిన చంద్రబాబు, రాష్ట్రంలో నిర్మితమవుతున్న ఏ ప్రాజెక్టులోనూ అవినీతి జరగలేదని, తాను అవినీతిని సహించే వాడిని కాదని వెల్లడించారు. బాబు చేసిన వ్యాఖ్యలపై జనసేనుడు ఎలా స్పందిస్తారా అన్నది చూడాలి.