రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే విషయం తెలిసిందే. కానీ శత్రువు అన్నుకున్నవాడిని ఆలింగనం చేసుకుంటున్నామంటే మనకు ఏదో ఒక ప్రయోజనం ఉందనే అర్థం. ఇక్కడ మనకు అంటే ఓ దేశానికి కావచ్చు.. ఓ రాష్ట్రానికి కావచ్చు. కానీ చంద్రబాబు ఆలింగనాలన్ని ఆయన స్వార్థ పూరిత ప్రయోజనాల కోసమే అనేది చాలా సార్లు రుజువైంది. రుజువవుతూనే ఉంది. ఇప్పుడీ విషయం ఎందుకు అంటే.. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీని ఆకాశానికి ఎత్తేస్తూ.. రాసుకు పూసుకు తిరిగిన రాహుల్గాంధీని ప్రస్తుతం చంద్రబాబు మర్చిపోయారు. ఇప్పుడాయనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేవతాలా కనిపిస్తోంది.
కారణం వీరిద్దరిలో చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. మోదీపై యుద్ధం, సీబీఐకు వ్యతిరేకంగా పోరాడటం.. ఇలా చెప్పుకుంటు పోతే ఇంకా చాలానే ఉన్నాయి. ఎన్నో లక్షల మందిని రోడ్డున పడేసిన శారదా స్కామ్పై సీబీఐ విచారణ అవసరం లేదన్నది దీదీ వాదన. కారణం ఏంటో మాత్రం అర్థం కాదు. ఈ స్కామ్కు సంబంధించి ఆమె ఎవరినైనా కాపాడాలని చూస్తున్నారా? అనే విషయం అర్థం కాదు. ఇక చంద్రబాబుపై ఉన్న పెండింగ్ కేసుల తుట్టె ఎక్కడ కదులుతుందో అని ఆయన భయం అనేది రాజకీయ విశ్లేషకుల మాట. సరే ఏదీ ఏమైనా సీబీఐ విషయంలో బాబు ఏ మాటలైతే చెబుతున్నారో.. ఆ మాటలనే చేసి చూపెడుతున్నారు మమతా. అందుకే చంద్రబాబు దీదీకి ఫ్యాన్ అయిపోయారు. మమత చేస్తున్న నిరసనకు కొందరు ముఖ్యమంత్రులు.. పలు పార్టీల అధినేతలు స్పందించారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏకంగా కోల్ కతాకు వెళ్లారు. మమతకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.
మొన్నటి వరకూ మోదీ నేతృత్వంలో నడిచే బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్లేట్ తిప్పేశారన్నది అసలు టాపిక్. మోదీ వ్యతిరేక విపక్ష కూటమికి నిర్మాత మమత అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు మమత మూలస్తంభమని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మమత తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తారని తేల్చేశారు. మరి కాంగ్రెస్ అధినేత రాహుల్ సంగతేంటీ? అన్నది ప్రశ్న. మమత సీన్లోకి వచ్చాక రాహుల్ను కొంపదీసి నలుసుగా భావిస్తున్నారా? అనేది ఇప్పుడు ప్రశ్న.