కాంగ్రెస్ పార్టీకి నిరసనల సెగ అధికమవుతోంది. టికెట్లు రాని అభ్యర్తులంతా పార్టీకీ రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్రెడ్డి రాజీనామా చేశారు. రాజేంద్రనగర్ నుండి పోటీ చేసేందుకు కార్తీక్ రెడ్డి ప్రయత్నించారు. మహా కూటమి(ప్రజాకూటమి) పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ సీటు టీడీపీకి దక్కింది. దీంతో పార్టీకీ రాజానామా చేసి అక్కడ నుంచి రెబల్గా పోటీ చేయనున్నారు.
తన రాజీనామాను ఆమోదిస్తారా? లేక రాజేంద్రనగర్ టికెట్ ఇస్తారా? అనే విషయం చెప్పాలని ఉత్తమ్కుమార్రెడ్డిని కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. త్వరలోనే నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలందరూ పార్టీకి రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామన్న కార్తీక్ రెడ్డి ప్రకటించారు.
2014 ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు.ప్రస్తుతం ఆయన రాజేంద్ర నగర్ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. దీంతో రాజేంద్రనగర్ నుండి గణేష్గుప్తాను టీడీపీ తన అభ్యర్ధిగా బరిలోకి దింపింది. దీంతో గురువారం నాడు ఉదయం తన అనుచరులతో కార్తీక్ రెడ్డి సమావేశమయ్యారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను పీసీసీ ఛీప్కు పంపించారు.