ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోమారు విరుచుకుపడ్డారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై తాను చర్చకు సిద్దమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ టీడీపీనేతలకు సవాల్ విసిరారు. శ్వేతపత్రాలన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయని …పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు శ్వేత పత్రం విడుదళ చేయలేదో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
60 సి నిబంధనను అడ్డుపెట్టుకుని పోలవరం పనుల్లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారని ఉండవల్లి విమర్శించారు. శ్వేతపత్రంలో వెల్లడించిన ఎల్ఈడీ బల్బుల కాంట్రాక్టులో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు.
తెలంగాణాలో చంద్రబాబు అతి ప్రచారమే కూటమి కొంప ముంచిందన్నారు. బాబు ప్రచారానికి పోకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే… ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు.
మరో వైపు జగన్ పాదయాత్రపైనా ప్రశంశల వర్షం కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డే గొప్పోడంటూ కితాబిచ్చారు. జనాలను ఉద్దేశించి మాట్లాడటంలో వైఎస్ కన్నా జగనే బాగా మాట్లాడుతున్నట్లు చెప్పారు. జనాలకు చెప్పదలుచుకున్నది చెప్పటంలో జగన్ స్పష్టంగా ఉన్నారని చెప్పారు. బాబులాగా వాట్ ఐయామ్ సేయింగ్ లాంటి డైలాగులు చెప్పడంలేదు. తండ్రి కంటే గొప్ప స్పీకర్ జగన్ అని కొనియాడారు.