నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయినా కూడా మహా కూటమికి చిక్కులు తప్పడంలేదు. ఒక వైపు టీఆర్ఎస్ నేతలు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే కూటమి మాత్రం ఇంకా టికెట్ల లొల్లిలోనే ఉంది. ఇది చాలన్నట్లు ఇప్పుడు టికెట్లు అమ్ముకున్నారనే ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి.
ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ కొడుకు సాగర్ డిమాండ్ చేశారన్న ఆడియో టేపు బయటపడింది. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ఛైర్మె్న్ డబ్బులు డిమాండ్ చేశారనే ఆడియో టేపును టీ-కాంగ్రెస్ నేత, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశం బయటపెట్టారు..
భక్త చరణ్ దాస్ కుమారుడు సాగర్ తో ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును ఆయన బయటపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక్కో టికెట్ ను 3 నుంచి 4 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఈ నెల 2న భక్తచరణ్దాస్ దగ్గరకు నా కుమారుడిని పంపిస్తే.. ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే 3 కోట్లు ఇవ్వాలని భక్తచరణ్ దాస్ కుమారుడు సాగర్ డిమాండ్ చేశారు. ఈ ఆడియోను రాష్ట్ర నాయకులందరికి చూపించాను.అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్లో చాలా మంది బ్రోకర్లున్నారని వారు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
బ్రోకర్లు అంతా కుమ్మకై అన్నాదమ్ములకు, భార్యభర్తలకు టికెట్లు ఇప్పించుకుంటున్నారని… నేను అబద్ధం చెబితే నన్ను ఉరితీయండి. భక్త చరణ్ దాస్ కు, ఆయన్ని సమర్ధించే ఈ దొంగనాయకులను సవాల్ చేస్తున్నా దమ్ముంటే ఎవరినైనా నేను చెప్పేవి అబద్దాలు అని నిరూపించండంటూ సవాల్ విసిరారు.