Sunday, May 12, 2024
- Advertisement -

ఏపీలో ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ ఆరాటం

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘోర అవ‌మానం ఎదుర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రాభ‌వం ఏర్ప‌డింది. చావు దెబ్బ‌తిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం ఆరాట ప‌డుతోంది. జ‌వ‌స‌త్వం ఇచ్చేలా ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు తీవ్రంగా చేస్తున్నారు. పార్టీలో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు ఊపునిచ్చేలా చిన్న చిన్న కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఎన్నిక‌ల నాటికి పార్టీని కొంత బ‌లంగా నిలిపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో, వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో కొద్దిమేర‌నైనా ప్ర‌భావం చూపాల‌ని భావిస్తున్నారు. అందులో భాగంగా త‌ర‌చూ ఏదో కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంటున్నారు.

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి వరప్రదాయినిగా పోల‌వ‌రం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు ప‌నులు మంద‌కొడిగా సాగుతుండ‌డం.. 25 శాతం కూడా ప‌నులు ముందుకు క‌ద‌ల‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అటు పార్ల‌మెంట్‌లోనూ.. ఇటు రాష్ట్రంలో పోరాడుతోంది. తమ ప్ర‌భుత్వ హ‌యాంలో చేప‌ట్టిన ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు ప‌నులు నెమ్మ‌దించ‌డంతో స్పందించి ఆ ప్రాజెక్టు త‌మ‌తోనే వ‌చ్చింద‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి ధ‌వ‌ళేశ్వ‌రం ప్రాజెక్టు నుంచి ప‌శ్చిమ గోదావ‌రి పోల‌వ‌రం దాకా పాద‌యాత్ర చేప‌ట్టారు. ఈ యాత్ర‌ను పాండిచ్చేరి ముఖ్య‌మంత్రి వ‌చ్చి ప్రారంభించారు. ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు చేశారు. ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహా పాదయాత్రకు మంచి స్పంద‌నే వ‌చ్చింది. పట్టిసీమ నుంచి పాదయాత్రగా పోలవరం చేరుకున్న కాంగ్రెస్ నాయకులు పోలవరం గ్రామంలోని భాను ధియేటర్ వద్ద సామూహిక సత్యాగ్రహం నిర్వహించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి స్పిల్ వే నిర్మాణ ప్రాంతంతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు.

ఈ ముగింపు సందర్భంగా ఎంపీ కేవీపీ రామచంద్రరావు చేసిన సవాల్ అదిరిందని.. టీడీపీ నేతల నోరు మూతపడేలా ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రలో నీటి విలువ తెలుసుకుని – పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి మరణించకుండా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాను అడ్డుకుంటున్నానని తెలుగుదేశం వారు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. చట్టప్రకారం నిర్మాణానికి పూర్తినిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని మాత్రమే కోర్టులో కేసు వేసినట్టు ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వారు చేసిన ఆరోపణ నిరూపిస్తే రెండున్నరేళ్లు ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనని కేవీపీ సంచలన సవాల్ చేశారు.

ఈ విధంగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాము ఉన్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పోరాటం చేస్తూ వెళ్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -