ఒకప్పుడు ఇద్దరు ఒక పార్టీలో ఉన్నారు.. అన్నదమ్ముల మాదిరి వ్యవహరించారు. చివరికి తన సోదరుడిగా ఉన్న ఎమ్మెల్యే జైలుకు వెళ్లితే పోరాటం చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఇద్దరు శత్రువులుగా మారారు. ఇది అంతే రాజకీయాలంటే మిత్రులు శత్రువులవుతారు.. శత్రువులు మిత్రులవుతారు. ఈ నానుడి ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు, రేవంత్రెడ్డి విషయంలో స్పష్టమవుతోంది.
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై పాలకుర్తి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్రెడ్డి ఎర్రబెల్లిపై చేసిన విమర్శలను తిప్పి కొట్టారు. తాను రేవంత్రెడ్డిని జైలుకు పంపిస్తే టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని రేవంత్ను ప్రశ్నించారు. గురువారం వరంగల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఇంటికి ఆ సమయంలో రేవంత్ ఎందుకు వచ్చారని అడిగారు. టీడీపీ నుంచి తాను పార్టీ మారలేదని, టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశానని చెప్పుకొచ్చారు. తనపై ఆరోపణలు చేయడానికి రేవంత్ అనే బ్రోకర్ను, బఫూన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డి పాత్ర ఐటమ్ సాంగ్ మాదిరి ఉందని తనదైన శైలిలో విమర్శలు చేశారు. సినిమాల్లో మాదిరిగా ఒక ఐటెం సాంగ్ వేస్తున్నట్లు కాంగ్రెస్ సభల్లో రేవంత్రెడ్డి ప్రసంగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు విచక్షణ మరచి స్పీకర్, తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమిటని ప్రశ్నించారు.