విశాఖలో ఎవరూ ఉహించని ఘటన జరిగి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. ప్రమాదకర విషవాయువు 10 మంది ప్రాణాలను తీసింది. బయటకు లీక్ అయిన ప్రమాదకర గ్యాస్ ను పీల్చి జనం ఎక్కడిక్కక్కడే కుప్పకూలిపోయారు. నడుస్తూనే ఊపిరాడక బొక్కబోర్లా పడిపోయారు. చిన్నపిల్లల పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఊపిరాడక ఉన్నచోటే పడిపోయారు.
ఇక నోరులేని మూగ జీవులు చూస్తే ఏడుపు వస్తోంది. కిందపడి గిలగిల కొట్టుకుని నురగలు కక్కుతూ చనిపోతున్నాయి. ఆవులు, కుక్కలు, పక్షులు ఇలా ఎన్నో నోరులేని జీవాలు ప్రాణాలు విడిచాయి. గోపాలపట్నం పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతం.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విషవాయువు లీకైంది. ఎల్జీపాలీమర్స్ అనే కంపెనీ నుంచి ఈ గ్యాస్ లీకైంది. తెల్లవారేలోపు సుమారు 3 కిలోమీటర్ల మేర విషవాయువు వ్యాపించింది. గాలిలో కలిసిన రసాయన వాయువును పీల్చి ఆ వాసనకు దగ్గుతూ ఉక్కిరిబిక్కిరయ్యారు ప్రజలు.
ఇండ్లల్లో పడుకున్నవారు ఊపిరాడక, కళ్ల మంటకు తాళలేక బయటకు పరుగులు తీశారు. రోడ్డుపై నడస్తూనే కుప్పకూలిపోయారు. ద్విచక్ర వాహానాలపై వెళ్లేవారు సైతం గిర్రున తిరిగి పడిపోయారు. ఒకరిద్దరు మురుగు కాలువలో పడి చనిపోయారు. ఆ ఏరియా అంతా భయంకరంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసి అందరు భయపడిపోతున్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. అక్కడ వారికి తగిన చికిత్స అందిస్తూ.. వారిని వేరే ప్రాంతంకు తరలిస్తున్నారు.