ఏపీసీఎం చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణా ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కూకట్ పల్లి టికెట్ టీడీపీకీ వచ్చింది. సీనియర్లకు కాకుండా బాబు వ్యూహాత్మకంగా నందమూరి సుహాసినిని ఇక్కడ నుంచి ఎన్నికల బరిలోకి దింపారు. ఎలాగైనా సుహాసిని తరుపున జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ప్రచారం చేస్తారని భావించిన బాబుకు షాక్ ఇచ్చారు అన్న దమ్ములు.
తన అక్క నందమూరి సుహాసినికి మద్దతుగా నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారని బాబు పెట్టుకున్న ఆశలపై నీల్లు చల్లారు. ప్రచారానికి జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఇద్దరూ దూరంగా ఉండే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. కల్యాణ్ రామ్ సతీమణి మాత్రం సుహాసినితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మరో నందమూరి నటుడు తారకరత్న ప్రచారం చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని నందమూరి సుహాసిని ఆశించారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్క సుహాసినికి షాక్ ఇచ్చారు. ఈ ప్రచారానికి వెళ్లకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇంతకుమించి తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోరాదని ఆయన నిర్ణయించినట్లు సమాచారం.
ప్రకటన వరకే పరిమితం కావాలని, అంతకు మించి ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రచారంలో పాల్గొనాలనుకుంటే ముందే ఎన్నికల కమిషన్ కు లేఖ పెట్టి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్టీఆర్ గానీ, మహాకూటమిగాని ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. దీంతో ఎన్టీఆర్ సుహాసిని ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.