నాలుగున్నర సంవత్సరాల పాటు ఒకే కంచం.. ఒకే మంచం అన్నట్టు కలిసి ఉన్న బీజేపీ-టీడీపీలు ఇప్పుడు ప్రస్తుతం ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా పోరాట పుణ్యమా అని ఓట్లు రాలవనో.. మళ్లీ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు ఏ మొఖం పెట్టుకొని అడుగుతామని తెలుసుకున్నారో తెలీదు కానీ చంద్రబాబు.. బీజేపీకి దండం పెట్టి బయటకు వచ్చేశారు.
అప్పటి వరకు రాజధాని నిర్మాణానికి బీజేపీ ఎంతో చేస్తుందన్న టీడీపీ నేతలు యూ టర్న్ తీసుకున్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదంటూ ప్రచారానికి దిగారు. ఇదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ఏపీ చీఫ్గా బాధ్యతలు తీసుకోవడం.. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు యాక్టివ్ కావడంతో టీడీపీపై రోజు సెటైర్లు, విమర్శలు చేస్తూ ఊపిరాడకుండా చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను కంట్రోల్ చేస్తూ ఈ వార్తలను ప్రజలకు చేరకుండా చేయడంలో విజయం సాధిస్తున్నారు కానీ.. సోషల్ మీడియాను మాత్రం ఆపడం లేదు.
బీజేపీ ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చూపకుండా.. మళ్లీ డబ్బులు అడగడం భావ్యం కాదంటున్నారు బీజేపీ నేతలు. ఇక కన్నా లక్ష్మీ నారాయణ అయితే ట్వీటర్ వేదికగా టీడీపీపై ఓ యుద్ధమే చేస్తున్నారని చెప్పాలి.
గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న ట్వీట్లను చూస్తేంటే ఆ సెటైర్లు మాములుగా ఉండటం లేదు. తాజాగా తెలుగుదేశం అంటే ‘తాత్కాలిక అభివృద్ధి-శాశ్వత అవినీతి’ అంటూ మరో ట్వీట్ ట్విటారు. ఏపీలో అసెంబ్లీ, ప్రభుత్వం, రాజధాని, శిలాఫలకాలు.. ఇలా అన్నీ తాత్కాలికమేనని ఎద్దేవా చేశారు. ఏపీలో అన్ని తాత్కాలిక నిర్మాణాలే … తాత్కాలిక ప్రభుత్వం..తాత్కాలిక రాజధాని.. తాత్కాలిక సెక్రటేరియట్.. తాత్కాలిక అసెంబ్లీ.. తాత్కాలిక శంకుస్థాపనలు.. తాత్కాలిక శిలాఫలకాలు.. రాష్ట్రం రాబోయే దశాబ్దంలో కూడా కోలుకోలేనంత శాశ్వత అవినీతి అంటూ విరుచుకుపడ్డారు. నిర్మాణాలే కాదు శిలాఫలకాలు కూడా తాత్కాలికమే అంటూ ఓ ఫోటోను ట్వీట్ చేశారు కన్నా.