వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో వారి పరిస్థితి ఎలా ఉందనే దానిమీద సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నారు బాబుగారు. ఆ సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయించ నున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజాగా అనంతపురంలో పార్టీ పరిస్థితిపై బాబ చేయించిన సీక్రెట్ సర్వే లీకవడంతో పార్టీ నేతల్లో అలజడి మొదలయ్యింది. మొదటినుంచి టీడీపీకీ అనంతపురంలో మంచి పట్టుంది. వెంటనే ‘అనంత’ ప్రజాప్రతినిధులతో పాటు సమన్వయకమిటీ సభ్యులను అమరావతికి పిలిచి సమావేశమయ్యారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత జూలైలో సీఎం స్వయంగా సర్వే చేయించినట్లు తెలిసింది. ఈ సర్వేలో పరిస్థితి మరింత దిగజారిందంట. అయితే ఈ రిపోర్ట్ తాజాగా లీక్ అయింది. పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలకు సర్వే ఫలితాలు తెలిసిపోయాయి. 14 నియోజకవర్గాల్లో 11 చోట్ల పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని, 2016లోని సర్వేకు, ఇప్పటికి పోలిస్తే పార్టీతో పాటు నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడైనట్లు తెలుస్తోంది. అనంతపురం పార్లమెంట్లో ఒక స్థానం మినహా తక్కిన ఆరు చోట్ల పార్టీకి ఓటమి తప్పదని తేలినట్లు సమాచారం.
ఈ ఆరు స్థానాల్లో ఇప్పటికే నలుగురికి టిక్కెట్లు దక్కవని పార్టీ లీకులు కూడా ఇచ్చింది. ఆ జాబితాలో గుంతకల్లు, అనంతపురం, శింగనమల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పుడు తక్కిన రెండు స్థానాల్లో ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. మంత్రి కాలవ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి కాకుండా గుంతకల్లు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీతో పాటు జిల్లాలో కూడా చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్సీ దీపక్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కూడా కాలవను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తే రాయదుర్గం కూడా ఈ జాబితాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్కు కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వరనే ప్రచారం ఉంది.
తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు నియోజకవర్గంలో మునుపటి పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పెద్దారెడ్డి నియామకం వారికి ప్రతికూలంగా మారింది. టీడీపీ జెండా మోసిన కాకర్ల రంగనాథ్, జగదీశ్వర్రెడ్డి, ఫయాజ్ లాంటి నేతలు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. ప్రజలనుంచి కూడా జేసీ బ్రదర్స్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఇక్కడ కూడా పరిస్థితి గడ్డుగా ఉంది. ఈక్రమంలో జాబితాలో ఉరవకొండ, తాడిపత్రిలో ఏది ఉందనేది స్పష్టత రావాల్సి ఉంది.