ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బండ బూతులు తిట్టారు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ మోదీ శిఖండి అని, తరిమితరిమి కొడతామని అన్నారు. వేదికపైనున్న చంద్రబాబు ముసిముసిగా నవ్వుతూ బావమరిది వ్యాఖ్యలను స్వాగతించారు.
ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఇదే తన చాలెంజ్ అన్నారు బాలకృష్ణ. రాష్ట్రంలో కొందరిని అడ్డుపెట్టుకుని వేషాలు వేయిస్తున్నారని వైసీపీ, జనసేనను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సభ్యత్వాలకు రాజీనామాలు చేయించి నాటకాలు అడిస్తున్నారని విమర్శించారు.
సామదానబేధదండోపాయాలు అంటారుకదా.. ఇప్పుడు చివరి దశలో ఉన్నాం. మోసం చేసిన మోదీని తరిమితరిమి కొట్టాలి. ఒక్క ఏపీలోనేకాదు దేశమంతటా ఆయనపై వ్యతిరేకత ఉంది. మోదీ.. నీకు తెలుగువాళ్ల ఘోష వినిపించట్లేదా? అయితే ముందు తెలుగు నేర్చుకో. దానితోపాటు పెద్దల్ని గౌరవించడం నేర్చుకో. అన్నింటికన్నా ముఖ్యంగా నీ భార్యను ప్రేమించడం తెలుసుకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తన ఆక్రోశం ఏంటో ఢిల్లీకి తెలియాలనే తాను హిందీలో మాట్లాడుతున్నానని బాలకృష్ణ చెప్పారు. కాసేపు హిందీలో మాట్లాడిన బాలకృష్ణ ఆ తర్వాత.. మోడీ ముందు నీవు తెలుగు నేర్చుకో అంటూ హెచ్చరించారు. దేశంలోనే రెండో అతిపెద్ద భాష తెలుగు అని చెప్పారు. కాబట్టి మోడీ తెలుగు నేర్చుకోవాల్సిందేనన్నారు. అయితే బాలయ్య వ్యాఖ్యలపై భాజాపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.