ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీకీ సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మొదటినుంచి మైనారిటీలకు బాబు అన్యాయం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ మంత్రికి మైనారిటీ నేతలు బిగ్ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వకపోతే మంత్రిని ఓడిస్తామని తీర్మానం చేశారు.
మంత్రి నారాయణ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాబుకు ఆర్థికంగా వెన్నదన్నుగా నిలిచే వ్యక్తులలో ఆయన ఒకరు. పార్టీకీ ఆర్థిక సాయం చేసి దాని ప్రతిఫలంగా సైడ్ ట్రాక్లో మంత్రి పదవిని పొందారు. అయితే ఈసారి నెల్లూరు సిటీ నియోజక వర్గం నుంచి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగాలని చేస్తున్నారు. దీనికి బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే స్థానికంగా మైనార్టీ నాయకుల సెగ మంత్రికి గట్టిగా తగులుతోంది.
మైనార్టీలంతా కలసి నారాయణకు వ్యతిరేకంగా ఏకంగా సభ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేశారు. నెల్లూరు సిటీ సీటు తమ నేత అబ్దుల్ అజీజ్ కి ఇవ్వకపోతే నారాయణకి వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. బహిరంగంగానే మైనార్టీ నేతలంతా కలసి పార్టీకి హెచ్చరికలు జారీ చేసే సరికి స్థానిక టీడీపీ నేతల్లో భయం మొదలైంది. దీంతో అధినాయకత్వం పునరాలోచనలో పడింది.
వైసీపీ తరపున నెల్లూరు నగర మేయర్ గా గెలిచిన అబ్దుల్ అజీజ్ ని అప్పట్లో ఎమ్మెల్సీ ఆశ చూపి టీడీపీ తమవైపు తిప్పుకుంది. ఎప్పటికప్పుడు మొండిచేయి చూపిస్తూ.. చివరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం టికెట్ ఇస్తామని ఆశ పెట్టింది. కానీ మంత్రి నారాయణ నెల్లూరు సిటీని ఖరారు చేసుకునేసరికి అజీజ్ అవాక్కయ్యారు. దీంతో అజీజ్ వర్గం రంగంలోకి దిగింది. నారాయణకు సీటు ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు.
నెల్లూరు సిటీలో మైనార్టీలకు మంచి పట్టు ఉండటంతో మంత్రి కూడా వెనకడుగు వేస్తున్నారని వినికిడి. వారిని కాదని బరిలో దిగితే ఓటమి ఖాయమని ఆయనకు కూడా తెలుసు. అందుకే ఈ సారికూడా సైడ్ ట్రాక్లో ఎమ్మెల్సీగానే సరిపెట్టుకోవాలని చూస్తున్నారు.
