చంద్రబాబు తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవలే జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. మొదట ఆయన కొడుకు రితేష్ను ఎన్నిక బరిలో దించాలని భావించినప్పటికి ఇండియన్ పౌరసత్వం విషయంలో సమస్య రావడంతో కొడుకు స్థానంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ సీటును కేటాయించారు జగన్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ వేసిన రోజు నుంచి ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఆయన్ని వెంటాడుతునే ఉంది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీ నుంచి ఒంగోలు సమీపంలోని పెళ్లకూరుకు చెందిన మరో వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా..? ఉందడీ… ప్రజాశాంతి పార్టీ తరుపున పోటీ చేస్తున్న వ్యక్తి పేరు కూడా వెంకటేశ్వరరావే. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇద్దరి ఇంటి పేర్లు కూడా దగ్గబాటే కావడం విశేషం. ఇద్దరి పేర్లతో పాటు, ఇంటి పేర్లు కూడా ఒకటి కావడంతో ఓటర్లు కన్ప్యూజ్ అవుతారని భావిస్తున్నారు దగ్గుబాటి. పైగా ఇద్దరి గుర్తులు కూడా ఒకేలా ఉండటంతో తమకు వేయాల్సిన ఓటు మరో పార్టీకి వేస్తారేమో అని తెగ అందోళన చెందుతున్నారట దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ కాగా, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్. ఈ రెండు గుర్తులు ఇంచుమించు ఒకేలా ఉండడం కూడా వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ విషయంపైనే వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఓట్లు ఎక్కడ చీలిపోతాయో అని భయపడుతున్నారు.
