నాగార్జునసాగర్ ఉపఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా తొలి రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో ఉన్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ఏర్పాటు చేశారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేస్తున్నారు.
సాయంత్రం 7 గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.ఇదిలా ఉంటే.. తొలిరౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 1,475 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయనకు 4,230 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,853 ఓట్లు పోలయ్యాయి.
బీజేపీ అభ్యర్థి రవికి కేవలం 157 ఓట్లే పోలయ్యాయి. టిఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ నేత జానారెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతుంది.