టీడీపీ ప్రభుత్వంపై జనసేనుడు విరుచుకు పడ్డారు. వైసీపీనీ మించి రాష్ట్రాన్ని టీడీపీ దోచుకుంటోందని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే భూకబ్జాలు పెరిగిపోతాయని అందుకే టీడీపీ, భాజాపాకు మద్దతిచ్చానని పవన్ వెల్లడించారు. కానీ ఇప్పుడు టీడీపీనే రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటోందన్నారు.
గత ఎన్నికల ముందు టీడీపీ వాళ్లు తన దగ్గరకి వచ్చి అడిగితేనే బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వెనకబాటుతనం పోయి అభివృద్ధి చేస్తారని భావిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక మాఫియా, భూ కబ్జాల్లో మునిగిపోయిందని అన్నారు.
40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఇసుకమాఫియాకు పనికి వచ్చిందాని బాబును ప్రశ్నించారు. ఉచిత ఇసుక పేరుతో అవినీతికి ఓ చట్టబద్ధత ఇచ్చింది ఆ అనుభవం. పొలాల్లో ఇసుక మేటలు వేసిందనే పేరుతో మీ నాయకులే మొత్తం దోచేస్తున్నారు. జనసేన పార్టీ ప్రజల ఆకాంక్షలు, యువత ఆలోచనలు తెలుసుకున్న పార్టీ. ప్రతి సమస్యనీ అర్థం చేసుకొనే పార్టీ. ఈ సమస్యలకి పరిష్కారం దొరికే వరకూ పోరాడుతుంది” అని అన్నారు.