ఆంధ్రప్రదేశ్ లో రెండోదశ పంచాయతీ ఎన్నికలు ఉదయం 6:30 గంటల నుంచి జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరడం విశేషం. రెండో విడతలో 3వేల328 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 539ఏకగ్రీవమయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని 2 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కానందున ఎన్నికలు జరగడం లేదు.
మిగిలిన 2 వేల 786 సర్పంచ్ స్థానాలకు 7 వేల 507 మంది పోటీ పడుతున్నారు. 33 వేల 570 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 12 వేల 604 ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన 20 వేల 817 వార్డుల్లో 44 వేల 876 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
రెండో దశకు 29 వేల 304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో 5 వేల 480 సున్నితమైనవిగా, 4 వేల 181 అతిసున్నితమైనవిగా గుర్తించినట్టు ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వివరించింది. ఇక ఇదిలా ఉంటె విజయనగరం జిల్లాలోని కిష్టపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. గుర్తులు చూపి వైసిపి కార్యకర్తలు ఓటు వెయ్యాలని ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.