ఏళ్లుగా తమిళ రాజకీయాలను ఊరిస్తూ వస్తున్న సూపర్స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు మౌనం వీడాడు. తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చాడు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మకిలీ పట్టిన రాజకీయాలను కడిగేయడానికి వస్తున్నట్లు తలైవా చెప్పారు. ఈ ప్రకటనతో తమిళనాడురలో ఉత్సాహ వాతావరణం ఏర్పడింది. తమిళ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకోబోతోంది. ఇప్పటివరకు ఉన్న రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టింది.
ఇటీవల అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తూ తన రాజకీయ ప్రవేశానికి రజనీకాంత్ బాట వేసుకున్నారు. గత ఐదు రోజులుగా అభిమానులతో సమావేశమవుతున్న రజనీకాంత్ తను చెప్పిన మాదిరిగా డిసెంబర్ 31వ తేదీన రాజకీయ ప్రవేశాలపై ప్రకటన చేశారు. ఇంటి నుంచి అభిమానులతో భేటీ అయ్యే ప్రదేశమైన శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపానికి బయల్దేరేటప్పుడు మీడియాతో ఆయన మాట్లాడలేదు. అనంతరం అభిమానులతో భేటీ సందర్భంగా రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేశారు.
`దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ మార్పు కోసం సమయం ఆసన్నమైందని తెలిపారు. పదవి, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పారు. నిజాయతీతో కూడిన రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. తమిళ ప్రజల మద్దతు ఉంటే నిజాయతీతో కూడిన రాజకీయాలు సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆదరణ, దేవుడి కటాక్షం తనకున్నాయని నమ్ముతున్నట్లు రజనీ భావిస్తున్నారు.
`గతంలో వలస పాలకులు మన దేశాన్ని కొల్లగొట్టారు. కానీ ఇప్పుడు మన పాలకులే ప్రజాస్వామ్యం పేరుతో మనల్ని కొల్లగొడుతున్నారు` అని రజనీ మండిపడ్డారు. రానున్న శాసనసభ ఎన్నికల్లోపే కొత్త పార్టీ స్థాపించనున్నట్లు తెలిపారు. 234 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తోందని ప్రకటించారు.
రజనీ రాజకీయ ప్రవేశంతో అభిమానుల ఆనందంలో మునిగారు. ఉత్కంఠ అనంతరం రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి సై అనడంతో అభిమానుల్లో జోష్ నింపినట్లయింది. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకుంటున్నారు.