ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ టీడీపీకీ ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. ప్రజాబలం ఉన్న మాజీ ఎమ్మెల్లేలు పార్టీనీ వీడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురంలో ఆ పార్టీకీ బిగ్ షాక్ తగిలింది. హిందూపురంలో మొన్నటి వరకు బాలకృష్ణకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్టు తన లేఖలో అబ్దుల్ ఘనీ ప్రస్తావించారు.శనివారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
30 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ.. పార్టీకి కృషి చేసినా.. తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న కారణంతో పార్టీని వీడినట్లు అబ్దుల్ ఘనీ ఈ సందర్భంగా తెలిపారు.నాలుగేళ్లుగా మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పంచిన ఘనత వైఎస్ఆర్ దేనని అన్నారు. అబ్దుల్ ఘనీ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
హిందూపురం ఎమ్మెల్యేగా 2004, 2009లో అబ్దుల్ ఘనీ టీడీపీ తరపున పోటీచేసి గెలిచాడు. 2014లో బాలకృష్ణ కోసం తన స్థానాన్ని వదులుకున్నాడు. పార్టీ అధిష్టానం మేరకు టికెట్ వదులుకున్నాడు. నాలుగేళ్లుగా పార్టీ కోసమే కృషి చేస్తున్నాడు. అయితే 2019 ఎన్నికల్లో మరోసారి టికెట్ బాలయ్యకే ఇవ్వనుండటంతో వేరే చేసేదేమిలేక ఘనీ పార్టీకీ రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
