తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలమధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజయం కోసం ఇరు పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ముందుకెల్తున్నాయి. ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ ఇతర పార్టీలతో మహాకూటమిగా ఏర్పడ్డాయి.
ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెష్టో కమిటీ ఛైర్మెన్గా కోమటిరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా కేసీఆర్పై నిప్పులు చెరిగారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం దగ్గర నుంచి వంద హామీలను కేసీఆర్ ఇచ్చారని… ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పతనం నల్గొండనుంచే ప్రారంభం అవుతుందని జోష్యం చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని… ఆ ప్రభుత్వంలో తాను కీలక పదవిలో ఉంటానని తెలిపారు. ప్రజా మేనిఫెస్టోను రూపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలతో చర్చించి మేనిఫెస్టోను రూపొందిస్తామని అన్నారు. మహాకూటమి వల్ల సీట్ల సర్దుబాటులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని… గెలిచే అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు.