ప్రజలను బెదిరించి, నోటి దగ్గరి తిండి లాక్కుంటామని బెదిరించి వైసిపి ఓట్లు సాధిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన… తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి అత్యధిక స్థానాలు సాధించినా… అది కేవలం బెదిరింపులతో సాధించినవే అని పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని తమ ఇష్టానుసారం పాలన చేస్తున్నారని.. ప్రశ్నిస్తే బెదిరించడం.. జైల్లో వేయడం చేస్తున్నారని అన్నారు.
శాసనసభలో అత్యధిక స్థానాలు పొందినా… జగన్ పరిపాలన ఏ మాత్రం ఉందో అందరికీ తెలిసిందే అంటూ పవన్ విమర్శించారు. రాష్ట్రవిభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న జనసేనాని… ఏపీకి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే బిజేపి కి పూర్తి మద్దతు ఇచ్చినట్టు వివరించారు. 3 రాజధానుల ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు చేసిన పవన్… తనకు వ్యక్తిగతంగా ఎవరితో కక్షలు లేవని.. కేవలం రాజకీయ విధానాలతోనే విభేదిస్తున్నామని స్పష్టం చేశారు.