తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేయడం వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారింది. అసలు ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కాక పార్టీనేతలు తలలు పట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన హఠాత్తుగా ఈ ప్రకటన చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడానికి గల కారణాన్ని మాత్రం భూమన స్పష్టం చేయలేదు. దీంతో మంత్రి పదవి ఇవ్వబోమని అధిష్ఠానం నుంచి స్పష్టమైన సూచనలు వచ్చిన నేపథ్యంలోనే భూమన కలత చెందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రి పదవులకోసం చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. భవిష్యత్ లో పోటీ చేయను అని ప్రకటిస్తే జగన్ మంత్రి వర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉండొచ్చని భూమన ప్లాన్ వేశారా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి సుగుణమ్మపై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. అందరు ఎమ్మెల్యేలు బంపర్ మెజారిటీతో గెలిస్తే భూమన మాత్రం కేవలం 780 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
భూమనపై ప్రజల్లోనే కాకుండా పార్టీ నేతల్లో కూడా అసంతృప్తి ఉందని సమాచారం. ఈ ఎన్నికల్లో భూమనకు టికెట్ ఇవ్వరంటూ కూడా ప్రచారం చేశారు. కాని జగన్కు అత్యంత సన్నిహితుడు కావడంతో టికెట్ ఇచ్చారు. జగన్ మీద ఉన్న అభిమానంతో మరో సారి భూమనను తిరుపతి ఓటర్లు గెలిపించారనేది బహిరంగ రహస్యం.భవిష్యత్తులో ఇంకోసారి గెలవలేమనే…చివరగా జగన్ కేబినెట్ లో బెర్త్ కోసం ఈ సంకేతం పంపారా అన్నదానిపై వాస్తవాలు తెలియాల్సి ఉంది. అయితే భూమన వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.