అధికారంలోకి రావాలని కసిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తాము ఇచ్చినా 2014లో అధికారంలోకి రాకపోవడం కలచివేసింది. తాము లబ్ధి పొందుతామని రాష్ట్రం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో అధికారానికి కాంగ్రెస్ దూరమైంది. కేంద్రంలో ఎలా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్కు రాజకీయంగా మంచి అవకాశం ఉంది. ప్రస్తుతం అధికార పార్టీపై, సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో తాము పుంజుకోకుంటే ఇక విధిలేక మళ్లీ టీఆర్ఎస్కు పట్టం కట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేల్కొంది.
అధిష్టానం ఆశీస్సులతో టీపీసీసీ చేవెళ్లలో ఈనెల 26వ తేదీ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని దర్గాలో ప్రార్థనలు చేసిన అనంతరం ఆరె మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం చేవెళ్లలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర చోట వీళ్లు బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే బహిరంగ సభలో టీపీసీసీ అగ్ర నాయకులు పాల్గొననున్నారు.
పాదయాత్ర వలన వైఎస్సార్ పార్టీని ఎలా అధికారంలోకి తీసుకువచ్చారో ఆ విధంగా తమకు ఈ పాదయాత్ర ద్వారా పునరుజ్జీవనం లభిస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషమేమంటే పార్టీ సీనియర్ నాయకులంతా కలిసి ఉమ్మడి స్వరం వినిపించనున్నారు. కాంగ్రెస్లో మొదటి నుంచి గ్రూపు రాజకీయాలు ఎక్కువ. ఇప్పుడు తెలంగాణలో పార్టీ గెలిస్తే నేను సీఎం అవుతానంటే నేను అవుతానంటూ ఆ విధంగా గ్రూపులుగా విడిపోయారు. ఇదే టీపీసీసీ పెద్ద మైనస్ పాయింట్. ముందు అయితే పార్టీకి బలం వచ్చేలా చేయరు. కానీ అప్పుడే సీఎం సీటు గురించి చర్చిస్తారు.
దీన్ని గ్రహించిన టీపీసీసీ అసంతృప్తులను కూడా కలుపుకొని బస్సు యాత్ర చేపడుతుండడంతో కాంగ్రెస్కు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తమ్కుమార్రెడ్డి పెత్తనం అంగీకరించిన కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్రెడ్డి దుడుకుతనంపై అసంతృప్తిగా ఉన్నవారు… హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య విభేధాలు ఎన్ని ఉన్నా వారందరూ కలిసి పాదయాత్రలో చేస్తున్నారు.
ఏ వేదిక మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఉన్న ఫొటోను చూడలేదు. ఇప్పుడు ఆ పరిణామం చోటుచేసుకోనుంది. ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్రెడ్డి ఇలా తదితర అగ్ర నాయకులు కలిసి ఐక్యతా రాగం పాడుతున్నారు. మరీ వీరి కలయిక 2019 ఎన్నికల్లో ఏమైనా ప్రభావం ఉంటుందో లేదో చూడాలి.