ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగ్గంపేటలో వైసీపీ భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబుపై సెటైర్ల వర్షం కురిపించారు. బాబు ఎక్కడ చూసినా అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమమైన రాజధానిగా నిర్మిస్తానని చేస్తిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి కాదు, బాబు భ్రమరావతి అని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిపై ఈనాడు దినపత్రికలో బాహుబలి సెట్టింగులు కనిపిస్తాయని ఆయన అన్నారు. జపాన్, సింగపూర్ భవనాలను చూపించి అమరావతి నిర్మాణం గురించి కథనాలు వస్తాయని ఆయన అన్నారు. అమరావతి రాజసం ఎలా ఉందంటే ఉద్యోగులు పది, పదిహేను నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్తారట అని అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు పథకాలపై, చంద్రబాబు కార్యక్రమాలపై ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను, వార్తాకథనాలను ఆయన దుయ్యబట్టారు. ఆస్పత్రులను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పినట్లు ఈనాడు దినపత్రిక రాసిందని, అయితే మనం జగ్గంపేట ఆస్పత్రినే చూస్తున్నామని, రెండు అంబులెన్స్ లుంటే ఒక్కటి కూడా పనిచేయదని ఆయన అన్నారు. ఆస్పత్రుల్లో చంటిపిల్లలను ఎలుకలు కొరుకుతుంటాయని అన్నారు. ఆస్పత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదని అన్నారు. దాంతో సెల్ ఫోన్లు, టార్చిలైట్లు పెట్టుకుని ఆపరేషన్లు చేసే పరిస్థితి ఉందని అన్నారు.