ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా బాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.
పోలింగ్ సందర్భంగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇనుమెట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి కోడెల వెళ్లి, లోపల అధికారులు ఉండగానే, తలుపులు బిగించుకున్నారన్నారు. అక్కడున్న సాధారణ ఓటర్లు ఆయన వైఖరిని ప్రశ్నిస్తే, తనంతటతానుగా బట్టలు చించుకుని బయటకు వచ్చి డ్రామాలు ఆడారని ఆరోపించారు.
కోడెల ఇంత చేస్తే, అదేమీ నేరం కాదన్నట్టు ఇంతవరకూ కేసు నమోదు చేయకుండా తిరిగి వైసీపీ కార్యకర్తలమీదె కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.. మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ తలుపులను ఎందుకు తీయాల్సి వచ్చిందని ప్రశ్నించిన జగన్, అన్ని స్ట్రాంగ్ రూముల భద్రతనూ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు స్ట్రాంగ్ రూమ్ నుండి బయటకు తీసుకొచ్చారన్నారు. తమ పార్టీకి చెందిన అభ్యర్ధులకు ఎందుకు ఈ సమాచారం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. సీసీ కెమెరాల లైవ్ ఫీడ్ ను కేంద్ర ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అందించాలని కోరామని అన్నారు.
ప్రజల తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందనె వార్తలతో ఈవీఎమ్లను బాబు తప్పుపడుతున్నారని జగన్ మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో ఇదే ఈవీఎమ్లతో గెలవలేదాని ప్రశ్నించారు. ఫలితాలు తనకు అనుకూలంగా వస్తే ఈవీఎమ్లు మంచివి, వ్యతిరేకంగా వస్తే చెడ్డవా అని ధ్వజమెత్తారు.
ఈవీఎమ్లలో ఒక పార్టీకి ఓటు వేస్తె మరొక పార్టీకి పడుతోందని బాబు ఆరోపించడం సిగ్గు చేటన్నారు. దాదాపు 80 శాతం పోలింగ్ నమోదయ్యిందన్న జగన్….ఈవీఎంలలో మీట నొక్కిన తర్వాత వేరే పార్టీకి ఓటు వెళ్లినట్టుగా ఉంటే ఓటర్లు ప్రశ్నించే వాళ్లని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాత్రం తాను ఎవరికి ఓటు వేసిందీ తనకు తెలియడం లేదని సినిమా డ్రామాలు ఆడుతున్నారని, ఓ విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
సెల్ ఫోన్ను నేనే కనిపెట్టింది అంటాడు, టెక్నాలజీని కనిపెట్టింది నేనే నంటాడు చివరకు అదే టెక్నాలజీని తప్పుబడతారన్నారు. నా కంప్యూటర్ కరెక్టే….బిలిగేట్సే బటన్ తప్పుగా నొక్కడని బాబు అంటాడని జగన్ ఎద్దేవ చేశారు.