జనసేన అధినేత పవన్, చంద్రబాబు నాయుడికి వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి డబుల్షాక్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై టిడిపి, వైసిపిలు ఎందుకు అవిశ్వాసం పెట్టడంలేదో అర్దం కావటం లేదని పవన్ కల్యాణ్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా కందుకూరు లో ఆదివారం మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలకు జగన్ సవాలు విసిరారు. అవిశ్వాసం పెట్టటానికి తాము సిద్ధమని ప్రకటించారు. టిడిపి మద్దతిస్తానంటే వైసిపి అవిశ్వాసతీర్మానం పెట్టటనికి సిద్దంగా ఉందన్నారు. లేకపోతే టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు.
పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదన్నారు. కోడిగుడ్డుమీద ఈకలు పీకినట్లు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పార్టనర్ పవన్ కు కందుకూరు నుండి అవిశ్వాస తీర్మానంపై తాను ప్రతిపాదన చేస్తున్నట్లు జగన్ చెప్పారు. చంద్రబాబు తానా అంటే పవన్ తందానా అంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదా వస్తే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ వేదికగా ఏపీకి హోదా కోసం ఎంపీలు పోరాటం చేస్తారని, అప్పటికీ హోదా రాకుంటే ఏప్రిల్ 6న లోక్ సభకు తమ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పుకొచ్చారు.