వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాదయాత్రలో ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్పై సెటైర్లు వేశారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇక్కడి ఒక ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్ చదివాడట’ అని టీడీపీ నేత జలీల్ ఖాన్ని ఎద్దేవ చేశారు. డబ్బులు తీసుకుని అమ్ముడు పోయి పార్టీ మారిన కొందరు అభివృద్ధి కోసమే అలా చేశామంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. వారి పక్కనే సీఎం ఉన్నప్పటికీ ప్రజల సమస్యలు తీర్చాలని అడగరని విమర్శించారు.
అలాగే చంద్రబాబుపైకూడా విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోరని జగన్ విమర్శించారు. అభివృద్ధి చేయరు కానీ అవినీతి మాత్రం చక్కగా చేస్తారని, విజయవాడలో ఒక్క ఫ్లై ఓవర్ కూడా కట్టలేకపోతోన్న చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని కడతానని అంటున్నారని విమర్శించారు.
విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ని ఇప్పటికీ కట్టలేకపోయారని, మరోవైపు రాజధాని స్కాంలకు నిలయమైందని అన్నారు. చంద్రబాబు చెబుతోన్న అసత్యాలకు అదుపు లేకుండా పోతోందని అన్నారు. అప్పట్లో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి వెళ్లే మార్గం కోసం 19 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ ను వైఎస్సార్ 3 ఏళ్లలోనే పూర్తి చేశారని, చంద్రబాబు కనీసం ఫ్లై ఓవర్ కట్టలేరు కానీ, అమెరికా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.