2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని జగన్ రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తుంటే సొంత జిల్లాలో మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇన్నాల్లు వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటలా ఉన్న కడపలో పార్టీకి బీటలు పారుతున్నాయి. కంచుకొట లాంటి కడప జిల్లాను నిర్లక్ష్యం చేయడమే ఇందుకు నిదర్శనమని కడప గడపలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
కడప జిల్లాను తన కనుసన్నలతో శాశించే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కి అదే జిల్లాలో వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి.ఆయనకు కంచుకోటగా ఉన్న కడప జిల్లా రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న కడపలో ఇప్పుడు జగన్మోహన్రెడ్డి కి ఎదురుగాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప ప్రజల మైండ్ సెట్ మారుతుందా అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో ఒక్క రాజంపేట మినహా మిగతా తొమ్మిది స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెల్చుకుంది. జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలలో అనేక సమస్యలున్నాయనీ, గెలిచిన ఎమ్మెల్యేలెవరూ ప్రజల యోగక్షేమాలను పట్టించుకున్న దాఖలాలు లేవని జనం వాపోతున్నారు.జగన్కూడా స్థానిక సమస్యలపై దృష్టిపెట్టలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రజల కనీస అవసరాలను తీర్చలేని జగన్ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు ఆదిశగా చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం అవుతున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల పులివెందులలో ప్రధాన సమస్య అయిన తాగు, సాగు నీటిని చంద్రబాబు అందించారు. అలా వారి చిరకాల కోరికను నెరవేర్చారు.
పులివెందులకు కృష్ణా జలాలను తెప్పించడంలో సఫలీకృతులైన చంద్రబాబు కడప ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కృష్ణా జలాల తరలింపు చంద్రబాబుకు మైలేజీని ఇవ్వగా, జగన్మోహన్ రెడ్డికి నష్టాన్ని కలుగజేసింది. ఇదంతా జగన్ స్వయంకృతాపరాధమేనని స్థానిక ప్రజానికం చర్చించుకుంటున్నట్టు సమాచారం.