గతంలో విజయవాడ వైఎస్ఆర్సీపీ నేత గౌతంరెడ్డి వంగవీటి రంగాపై చేసిన వ్యాఖ్యలు విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. దాంతో రాధ, గౌతంరెడ్డి ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఒకానొక సమయంలో గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా విభేదాలపై గౌతంరెడ్డి స్పందించారు.
అయితే ఇటీవల జగన్ పాదయాత్రలో గౌతం రెడ్డి ప్రత్యక్షం అవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే గౌతం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…..తాను వంగవీటి గురించి ఉద్దేశ్యపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఇంటర్వూ మొత్తం ఫుటేజ్ నా దగ్గర ఉందని, తనని వైసీపీ నుండి సస్పెండ్ చేసినట్లు మీడియాలో చూశానని, కాని ఎలాంటి ఉత్తర్వులు పార్టీ నుండి రాలేదంటూ గౌతం రెడ్డి చెప్పడం గమనార్హం.
విజయవాడ సెంట్రల్ సీటు రాధాకే అని తనకు జగన్ చెప్పారని… రాధాతో కలసి తాను పని చేస్తానని తెలిపారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధాకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని గౌతం రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు సీటు ఇస్తానని జగన్ చెప్పినట్లు గుర్తు చేశారు గౌతం రెడ్డి. ఇక పై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని గౌతం రెడ్డి స్పష్టం చేశారు. గౌతంరెడ్డి, వంగవీటి రాధ మధ్య ఉన్న విబేధాలు ముగిసినట్లే.