ఏపీసీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక సామాజిక నేరగాడు.. ఒక వెన్నుపోటు దారుడని ఏపీ ప్రజలు గుర్తించారని అన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయి.. నేటికీ ‘మనవాళ్లు బ్రీఫ్డ్మీ’ వాయిస్ తనది కాదని చెప్పలేకపోయిన వ్యక్తి చంద్రబాబు అని ఆర్కే ధ్వజమెత్తారు.
వైఎస్ఆర్సీపీ నేతలను ఆర్థిక నేరగాళ్లు అని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చుట్టూ ఉండే వారే అసలైన ఆర్థిక నేరగాళ్లన్నారు. సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, రాయపాటి బ్యాంక్లకు డబ్బులు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లు కాదా అని ఆర్కే ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మొత్తం దోచేసిన చంద్రబాబు అతిపెద్ద ఆర్థిక నేరగాడంటూ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, మట్టి, ఇసుక ఇలా ప్రతి విషయంలో దోచుకుని చంద్రబాబు సుమారు రూ. 5 లక్షల కోట్లు సంపాదించారని ఆర్కే ఆరోపించారు.
ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీక్షలు, ధర్నాలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలకు సంజీవని అని పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉన్నారని చెప్పారు.
వైఎస్ఆర్సీపీ నేతలపై పెట్టినవన్నీ అక్రమ కేసులని న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్ ఒక్కొక్కటిగా కొట్టేస్తున్నాయని ఆర్కే తెలిపారు. ఆర్థిక నేరగాళ్లు చంద్రబాబు చుట్టూ ఉన్నారు. బాబు పక్కనే ఉండే సుజనా చౌదరి మారిషస్ దేశ బ్యాంక్ నుంచి వేల కోట్లు అప్పు తీసుకొని ఎగనామం పెట్టాడన్నారు. అదే విధంగా రాయపాటి సాంబశివరావు, గంటా శ్రీనివాసరావులు ప్రజలు బ్యాంక్లలో దాచుకున్న సొత్తును అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించలేదన్నారు. ఇలాంటి ఆర్థిక నేరగాల్లను చుట్టూ పెట్టుకొని జగన్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.