ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. జగన్పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయని ఆరోపించారు. జగన్ పై దాడి జరిగితే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు వెకిలిగా నవ్వుతూ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని దొంగల పార్టీగా మార్చిన చరిత్ర చంద్రబాబుదని వ్యాఖ్యానించారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేను చంపేసినా కాపాడుకోలేని దారుణమైన స్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతిపక్షనేతపై జరిగిన దాడి కేసును నీరుగార్చేందుకు సీఎం ఎంతగానో మేనేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్లోని రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి జనవరి నుంచి కత్తిని అక్కడే ఉంచినా… కేసులు ఉన్న వ్యక్తికి ఎన్వోసీ ఇప్పించి ఉద్యోగంలోకి తీసుకున్నా ఎవరు ప్రశ్నించడం లేదని రోజా ఎద్దేవా చేశారు. ఛార్జిషీటులో హర్షవర్థన్ చౌదరి పేరును చేర్చేలేదని.. కాల్డేటాను పరిశీలించలేదని ఆమె గుర్తు చేశారు.
కత్తి కనుక మెడకు తగిలితే అక్కడికక్కడే మనిషి చనిపోతాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నా.. దానిని చిన్న ఘటనగా ముఖ్యమంత్రి తీసిపారేశారన్నారు. దాడిని ప్రతీ ఒక్కరూ కండిస్తున్నా బాబు మాత్రం కనీసం సానుబూతి కూడా తెలుపలేదన్నారు.
నిందితుడు శ్రీనివాసరావును ఇప్పటివరకు ఎందుకు మీడియా ముందుకు తీసుకురాలేదని రోజా ప్రశ్నించారు.కేంద్రాన్ని తాము ఒకటే కోరుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని సంస్థతో దీనిపై విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అలా అయితేనే ఇందులో అసలు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు.
అప్పట్లో అలిపిరి వద్ద తనపై దాడి జరిగితే దాన్ని సానుభూతి మలుచుకోవడానికి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాడని రోజా గుర్తుచేశారు. కానీ జగన్ అలాంటివాడు కాదని, సానుభూతి కోసమే జగన్ ఇదంతా చేస్తున్నాడన్న టీడీపీ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు.