ప్రత్యేకహోదా కోసం ముందు చెప్పినట్లుగానే తమ పదవులకు వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా పత్రాలను స్పీకర్ సుమిత్రామహాజన్కు అందించారు. రాజీనామాలు చేసిన వెలంటనే ఎంపీలు ఢిల్లీలోని ఆంధ్రభవన్ వద్ద ఆమరణదీక్షను చేపట్టారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ లు ఆమరణదీక్షలో కూర్చున్నారు. అంతకు ముందు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వారు నివాళి అర్పించారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి ఆంధ్రభవన్ కు చేరుకున్నారు. దీక్ష చేపట్టిన ప్రాంగణం వద్ద దివంగత వైయస్ ఫొటోకు నివాళి అర్పించి దీక్షలో కూర్చున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు దీక్ష ప్రారంభమైంది. దీక్షలో కూర్చున్న ఎంపీలకు సంఘీభావం తెలిపేందుకు పలువురు వైసీపీ మద్దతు దారులు అక్కడకు చేరుకున్నారు. వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అనంత వెంకట్రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు ఎంపీలతో పాటు వేదికపై కూర్చున్నారు.