ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతల బృందం కలిసింది. ఏపీలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు, ఆపద్ధర్మ ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పులు, ఈసీ నియామవళి ఉల్లంఘిస్తున్న టీడీపీపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్లకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాని వారు కోరారు. సీఈసీని కలిసిన ఈ బృందంలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వేమిరెడ్డి, బాలశౌరి, సి.రామచంద్రయ్య, అవంతి, బుట్టా రేణుక తదితరులు ఉన్నారు.
ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం విజయసాయిరెడ్డి టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో శాంతిభద్రతల ఉద్రిక్తతలు స్పీకరే సృష్టించడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయకుండా తిరిగి వైసీపీ నేతలపైనె కేసులు పెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
మచిలీ పట్నంలో ఈవీఎం స్ర్టాంగ్ రూమ్ లోపలి దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మరిన్ని కేంద్ర బలగాల భద్రత పెంచాలని ఈసీని కోరినట్లు పేర్కొన్నారు. విజయనగరం, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో శాంతి భద్రతల ఉల్లంఘన జరిగిందన్నారు.
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ-ప్రగతి పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని…ఈ కేసులో సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు జైలుకెళ్తారని చెప్పారు విజయసాయిరెడ్డి.
చంద్రబాబుతో రిటైర్డ్ అధికారి సత్యనారాయణ లాలూచీ పడి ఆధార్ డేటాను లీక్ చేశారని..ఈ-ప్రగతికి అందజేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు, డీజీపీ వ్యక్తులు కలిసి ఈ సంస్థలను స్థాపించారని విమర్శించారు. చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును జైలుకు పంపేందుకు ఈ ఒక్క కేసు చాలన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు సరైన సమయంలో బయట పెడ్తామని హెచ్చరించారు.