పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు నిద్రలో కూడా కలవరిస్తున్న పేర్లు సీబీఐ, నరేంద్రమోదీ. శారదాస్కామ్పై సీబీఐ విచారణ జరపడాన్ని దీదీ జీర్ణించుకోలేకపోతున్నారు. 34 ఏళ్ల పాటు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న బెంగాల్ను కుప్ప కూల్చడమే గాక..రెండో సారి బెంగాల్ ప్రజల అభిమానాన్ని చూరగొని మోస్ట్ డేరింగ్ లీడర్గా పేరు తెచ్చుకున్న మమతా.. ఇప్పుడు సీబీఐకు భయపడుతున్నారు. నిజంగానే భయపడుతున్నారా? లేక దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది తానే అని చూపించుకోవాలనుకుంటున్నారా? అనేది తెలియని.. తేలని విషయం. ఇక ఈ విషయంలో సుప్రీం కోర్టు మెట్లెక్కి కూడా పరాభవాన్ని మూటగట్టుకున్నారు మమతా.
సుప్రీం కోర్టు తీర్పుతో మమతాకు వచ్చిన హైప్.. ఒక్కసారిగా తుస్సుమంది. దానిని కూడా ఆమె తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించారు. కానీ అంతగా విజయవంతం కాలేదు. ఇక సిట్ ఇంఛార్జ్ రాజీవ్కుమార్ను విచారిస్తే వెలుగులోకి వచ్చే విషయాలు మమతా భవితవ్యాన్ని డిసైడ్ చేయనున్నాయి. ఎన్నికలు దగ్గరపడే సమయానికి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.
ఇక మోదీ చూపు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుపై పడ్డట్టు సమాచారం. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా జరిగే ప్రతి సమావేశంలోనూ ఈ మధ్య చంద్రబాబు కనిపిస్తున్నారు. తన వంతుగా గొంతెత్తున్నారు. ఆయన అనుంగు మీడియా మాత్రం మొత్తం ఆయనే చేసినట్టు చూపిస్తుంది… అది వేరే విషయం.
ఇప్పటికే మోదీ ఎక్కడ తనపై పడతారో.. అసలే తనకు అనుకూలంగా ఉన్న సీబీఐలోని అధికారులకు బదిలీలు కావడంతో ముందు జాగ్రత్తగా తన అధికారాలను ఉపయోగించి సీబీఐకు ఏపీలో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇక్కడ కూడా మమతనే ఫాలో అయ్యారు చంద్రబాబు. దీదీ కూడా బెంగాల్లో సీబీఐ ఎంట్రీకి నో చెప్పింది. కానీ బాధితులు సుప్రీంను ఆశ్రయించడం.. కోర్టు విచారణకు ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఏపీలో కూడా అదే సీన్ రీపిటైతే.. ఇప్పటికే సుప్రీంలో పేరుకుపోయిన చంద్రబాబు కేసుల కట్టను కదలించాలని ఎవరైనా పిటిషన్ వేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటీ? అనే టెన్షన్ ఆయనలో అయితే ఉంది.
దీనికి తగ్గట్టుగానే గ్రౌండ్ను ప్రిపెర్ చేసుకుంటున్నారు చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం నాపై చర్యలు తీసుకుంటే ప్రజలే తనకు రక్షణ వలయాలుగా నిలవాలని.. ప్రజలే తనను కాపాడాలని చెబుతూ వస్తున్నారు. దీని ఆంతర్యం ఏంటో ప్రజలకు అర్థమవుతూనే ఉంది.
చంద్రబాబు అంటే ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ అంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన డైరెక్ట్గా ఏ పని చేయరు.. ఎందులో ఇన్వాల్వ్ కారు. తెర వెనుక ఆయనకు పెద్ద కోటరి ఉంటుందంటారు. వారు బాగుంటేనే ఆయన బాగున్నట్టు. అందుకే వారిపై ఈగ కూడా వాలనివ్వరు టాక్. మోదీకి ఈ విషయం తెలిసే బాబు ములాలను కత్తిరించే పనిలో పడ్డారని సమాచారం.
అందుకే చంద్రబాబు బినామీలుగా ఉన్న పలువురు వ్యాపారస్తులపై ఐటీ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కానీ ఈ అంశాన్ని కూడా రాజకీయం చేసి దీన్ని ఏపీపై దాడిగా చూపించారు. మీడియాలో కూడా ప్రజలకు ఆ రకంగానే చూపించారు. ఎవరో వ్యక్తులు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారు అని తెలుసుకొని వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదా చేస్తే సామాన్య ప్రజలకు వచ్చిన నష్టం ఏంటో మాత్రం చంద్రబాబు చెప్పరు. అది ఏపీపై దాడి ఎలా అవుతుందో వివరించరు. తన ఆర్థిక మూలాలను కేంద్ర ప్రభుత్వం కదిలిస్తుందనే చంద్రబాబు ఇంతలా ఇబ్బంది పడుతున్నారని టాక్.
మరి మమత పని ముగించుకొని ఏపీకి ఫిబ్రవరి 10న వస్తున్నారు మోదీ. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మోదీ ఏపీకి వస్తున్నారు. కేంద్రం చేసే సాయం గురించి ఆయన చెబుతారు. అక్కడితో ఆగుతారా? లేక తెలుగు ప్రజలకు, చంద్రబాబుకు ఇంకేమైనా గిఫ్ట్లు అందించబోతున్నారా? వేచి చూడాల్సిందే.