వ్యవస్థలను ప్రధాని మోదీ భ్రష్టుపట్టిస్తున్నారు.. సీఎం చంద్రబాబు నోట ఈ డైలాగ్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. కానీ రాష్ట్రంలో తాను ఏం చేస్తున్నానో మాత్రం ప్రపంచానికి తెలియకుండా దాచేస్తారు. కానీ అన్నిసార్లు అది కుదరదు. అధికారం ఉంది కదా.. మనకు అడ్డెవరు అనుకున్న టీడీపీ నేతలు ఈ సారి మాత్రం బొక్కబోర్లాపడ్డారు.
ఎన్నికల సమయంలో తమకు సహకరించాల్సిందిగా కోరుతూ స్థానిక పోలీసులకు లంచాలు ఇవ్వబోయారని అంటూ.. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టబోయిన వ్యవహారం గుర్తుంది కదా. ఇప్పుడా వ్యవహారం అడ్డం తిరిగింది. కొద్ది రోజుల క్రితం మైలవరంలో రాజుకున్న రాజకీయ వివాదాన్ని జిల్లా ఎస్పీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ముగింపు పలికారు. ఎన్నికల్లో తమకు సహకరించాలంటూ నియోజకవర్గంలోని పోలీసులకు వైఎస్ఆర్సీపీ నేతలు డబ్బులు ఇవ్వజూపారనే ఆరోపణ అవాస్తమని పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెప్పేశారు. అంతేకాదు ఎస్ఐలు అస్పక్, శ్రీనివాసులు స్థానిక టీడీపీ నేతల సూచన మేరకే కేసులు పెట్టబోయారని పోలీసుల అంతర్గత విచారణలో తేలింది. దీంతో ఆ ఎస్ఐలు ఇద్దరినీ వీఆర్ కు పంపిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.
దీన్ని బట్టి మైలవరం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో మొత్తం వ్యవహారం నడించిందని స్పష్టం అయ్యింది. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు ఎన్నికల్లో పోలీసుల పాత్ర గురించి ఫిర్యాదు చేశారు. సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే చంద్రబాబు ప్రమోషన్లు ఇచ్చి ఎన్నికల సమయంలో వారిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తూన్నారని జగన్ ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే మైలవరంలో ఈ వ్యవహారం వార్తల్లోకి వచ్చింది. జగన్ ఢిల్లీ పర్యటనను కనుమరుగు చేసి దానికి కౌంటర్గా అన్ని చానళ్లలో ఈ వార్తనే ప్రసారం చేశారు. కానీ చివరికి వచ్చేసరికి వారు తీసుకున్న గోతిలోనే వారు పడ్డారు. కానీ ఎస్ఐలపై చర్యల విషయానికి సంబంధించిన వార్త మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకో మరి? ఇక్కడ వ్యవస్థలను భ్రష్టు పట్టించేదేవరో మరి?