తెలంగాణా లో తెలుగు దేశం పార్టీ పూర్తిగా బిచానా కట్టేసింది. క్యాడర్ ని నిరుత్సాహం తప్ప ఏమీ కనపడ్డం లేదు. వరస వైఫల్యాలతో ఆ పార్టీ కుదేలు అయ్యింది. కానీ కవరింగ్ హీరో రేవంత్ రెడ్డి మాత్రం తెలుగు దేశం మీద చాలా నే ఆసలు పెట్టుకున్నారు.
పోనీ తెరాస కి వెళ్ళిపోదామా అంటే కెసిఆర్ తో ఓటుకు నోటు లో చాలా పెంట పెట్టుకున్నారు కాబట్టి కుదిరే సమస్యే లేదు. దేశం పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుందని కలలు కంటున్నారు రేవంత్ రెడ్డి. పార్టీని తూట్లు పొడిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.
ఓ పత్రికలో రాసిన వ్యాసంలో ఆయన తెరాసపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో తన కుటుంబమే రాజ్యమేలాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్నారంటూ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి కూడా కనీస గౌరవం దక్కలేదనీ, సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన తుమ్మలనాగేశ్వరరావుకు మంత్రి పదవి కట్టబెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తెరాస పాలన కొత్త మోజు మాత్రమేనని, ఇది ఎల్లకాలం ఉండదని జోస్యం చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందనీ, పెద్ద ఎత్తున ప్రజాభిమానం ఉందని, అందుకే దేశం చిరస్థాయిగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఏదేమైనా రేవంత్ రెడ్డి ని చూసి జాలి పడుతున్న వారు కోకొల్లలు.