మాటలేగా…….ఏమైనా అనేద్దాం……బురద చల్లుదాం……మీడియా అంతా మన చేతుల్లోనే ఉంది కాబట్టి అబద్ధాలతో అమాయకులైన జనాలను నమ్మించొచ్చు అన్నది చంద్రబాబు సిద్ధాంతం. ప్రజల మధ్దతు కంటే ఇలాంటి అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు రాజకీయాలతో, కుట్ర రాజకీయాలతో నెట్టుకొస్తున్నాడు బాబు. అలాంటి చంద్రబాబుతో పార్ట్నర్షిప్ రాజకీయాలు చేస్తున్న పవన్ కూడా ఇప్పుడు ఆయన రూట్లోనే ఉన్నాడు. పులివెందులలో వైఎస్సార్ కుటుంబం ముందు నుంచీ చెప్పులు చేతులతో పట్టుకెళ్ళాలి లాంటి నీచమైన మాటలు మాట్లాడాడు. ఇక పులివెందుల రౌడీలు, రాయలసీమ రౌడీలు అంటూ చంద్రబాబు ఎన్నోసార్లు ఎన్నో మాటలు మాట్లాడాడు. అయితే అసలు పులివెందుల ప్రజలకు, కడప ప్రజలకు……ఆ మాటకొస్తే వైఎస్సార్ ఇంటికి వెళ్ళిన రాయలసీమ, ఆంధ్ర ప్రజలకు వైఎస్ కుటుంబం అంటే ఎందుకు అంత ఇష్టం? కుప్పంలో, చంద్రగిరిలో బాబుకు, గోదావరి జిల్లాల్లో చిరంజీవి, పవన్ల కుటుంబాలకు, వేరే ఏ రాజకీయ నాయకుడి కుటుంబానికి లేనంత ఆదరణ వైఎస్లకే ఎందుకు ఉంది? స్వయంగా ఒక పులివెందల వాసి అనుభవం మీరే చదవండి.
నేను పులివెందులలో డిగ్రీ చేశాను. కాలేజీ పేరు శ్రీ వైఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీ. (తర్వాత దీని పేరు లయోలా డిగ్రీ కాలేజీగా మారింది). మా ఇంటి దగ్గరనుంచి కొండ మీద వున్న కాలేజీకి వెళ్లాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటి మీదుగానే వెళ్లాలి. వైఎస్సార్ కుటుంబానికి చెందినవారు ఎవరో ఒకరు కనిపిస్తూనే వుండేవారు. కొన్ని వందల సార్లు నేను వైఎస్ రాజశేఖరరెడ్డి తల్లిదండ్రులైన వైఎస్ రాజారెడ్డి, ఆయన సతీమణి జయమ్మలను చూశాను. వారు ఏనాడూ ప్రత్యేకంగా కనిపించలేదు. సాధారణ మధ్యతరగతి మనుషులుగానే కనిపించారు.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వైఎస్సార్ ఇళ్లు నిత్యం జనంతో నిండి వుండేది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చే సిఫారసు లెటర్లకోసం నిత్యం చాలా మంది వచ్చేవారు. ఈ సిఫారసు ఉత్తరాలతో కాంగ్రెస్ వాళ్లకంటే టిడిపి వాళ్లే ఎక్కువగా లబ్ధి పొందారనేది అందరూ చెప్పుకునే మాట. సాయమే కావాలని వైఎస్సార్ దగ్గరకు వస్తే..ఇక ఆ వ్యక్తి ప్రత్యర్థివర్గానికి చెందినవాడైనా సరే తప్పకుండా సాయం చేయడం వైఎస్సార్ స్వభావం. దాదాపుగా అందరి పనులు అయిపోయేవి. రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ మాటకు అంత పవర్ వుండేది.
పులివెందుల్లో వైఎస్సార్ పని చేసిన ఆసుపత్రి (1970లలో వైద్య వృత్తి ప్రాక్టీస్ చేశారు) అందరికీ అందుబాటులో వుండేది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కేవలం ఒక రూపాయి ఫీజుగా తీసుకొని వైద్యం చేసేవారు. అందుకే ఆయన్ను రూపాయి డాక్టరనేవారు. పేరుకే రూపాయి ఫీజుగానీ అదికూడా చెల్లించలేనివారు వస్తే..వారికి ఉచితంగా చికిత్స చేసేవారు. అంతేకాదు తన జేబులోంచి డబ్బులు తీసి మందులవీ కొనిపించి, బస్సు ఛార్జీలకు ఇచ్చి పంపించేవారు. మానవత్వం అనే పదానికి నిలువెత్తు నిర్వచనం వైఎస్సార్.
ఇక అసలు విషయానికి వస్తే పవన్ కల్యాణ్ అధ్వాన్నపు విమర్శలు చేసి మరోసారి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పటికే గాడి తప్పిన విమర్శలతో, చీకటి పొత్తులతో ఏపీలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇలాంటి స్థితిలో పవన్ చేసిన విమర్శ ఇది. వైఎస్ జగన్ ఇంటి ముందు దళితులు చెప్పులు విడిచి చేత్తో పట్టుకొని వెళతారని పవన్ కల్యాణ్ వెకిలి విమర్శ చేశాడు. వైఎస్ఆర్ మేనత్తలు ( వైఎస్ రాజారెడ్డి సిస్టర్స్) ఆ కాలంలోనే పెద్ద చదువులు చదివి..కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రగతి వాద భావాలతో దళితులను పెళ్లి చేసుకున్నారు. ఎస్సీలు నా బంధువులని… నేను గర్వంగా చెప్పుకుంటానని వైఎస్ జగన్ గతంలో ఓ సందర్భంలో అన్నారు. వైఎస్ఆర్ కుటుంబంలో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలవారు వున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఏనాడూ ప్రత్యేకంగా చెప్పుకోరు. ప్రత్యేకంగా ప్రస్తావించరు. పవన్ కల్యాణ్ లాంటివారు విషం కక్కినప్పుడు నాలాంటివారు స్పందించాల్సి వస్తుంది. రాజకీయాల్లో కొనసాగాలంటే మెచ్యూరిటీ వుండాలి. పాపం పవన్ కల్యాణ్…చంద్రబాబుతో సావాసం చేయడంతో పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోయినట్టున్నాడు.