ఒకే కుటుంబం.. ఓ కాలేజ్, ఒకే బ్యాచ్.. ఒకే బెంచ్.. ఒకే వృత్తిగా ఎంచుకున్న ముగ్గురు అమ్మాయిల అరుదైన సంఘటన. వైద్య వృత్తి అంటే ఎన్నో కష్టాలు పడాలి.. మంచి సీటు, ర్యాంకు వచ్చినా చేయడం కష్టం. అలాంటి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి వైద్య వృత్తిని ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగరంలోని శ్రీరాంపురం కాలనీ సమీపంలోని విశ్వనాథపురం కాలనీలో శంకర్కు శ్వేత, స్వాతి, శ్రుతి ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు. ఈయన ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కూతుళ్లకు ‘నీట్’లో ముగ్గురికీ ఒకేసారి ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ముగ్గురూ బళ్లారిలోని ‘విమ్స్’ (విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సీటు పొందారు. 2014లో పీయూసీ పూర్తి చేసిన శ్వేత అప్పట్లో అనారోగ్య కారణాలతో ఎంబీబీఎస్ సీటు సంపాదించుకోలేకపోయింది. రెండో అమ్మాయి స్వాతి 2015లో పీయూసీ పూర్తి చేసి ఏఐపీఎంటీ (ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్) పరీక్షలు రాసి ఎంబీబీఎస్కు ప్రయత్నించింది. అయితే ఆ ఏడాది కూడా ఇద్దరికీ సీటు రాలేదు. మూడో కుమార్తె శ్రుతి 2017లో పీయూసీ పూర్తి చేయడంతో ఈసారి ముగ్గురూ కలిసి బెంగళూరులో 2016-17 విద్యాసంవత్సరంలో జాతీయ స్థాయి ‘నీట్’ పరీక్షలు రాశారు.
నీట్లో శ్వేత 1,216, స్వాతి 1,413, శ్రుతి 750వ ర్యాంకులను సాధించడంతో బళ్లారి విమ్స్లో వీరి ముగ్గురుకి ఎంబీబీఎస్ చదివేందుకు సీటు లభించింది. సాధారణంగా టెన్త్లో లేదా పీయూసీలో.. అక్కాచెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు ఒకే తరగతి గదిలో కూర్చొని చదువుకోవడం చూస్తుంటాం. అయితే ప్రతిష్టాత్మకమైన ఎంబీబీఎస్లో కూడా ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే బ్యాచ్లో సీటు లభించడం మరెక్కడా జరిగి ఉండదు. ఒకే కాలేజీ, ఒకే బెంచ్లో కూర్చునే అవకాశం లభించడం నిజంగా విశేషమే. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిలు ముగ్గురూ ఒకేసారి ఎంబీబీఎస్లో సీటు దక్కించుకోవడం మరొక విశేషం. శ్వేత, స్వాతి, శ్రుతి రోజూ ఉదయం ఇంటి నుంచి ముగ్గురు కూతుళ్లు కాలేజీకి వెళ్తుంటే తండ్రి శంకర్ పరమానందపడుతున్నాడు. తాను సాధించలేనిది తన కూతుళ్లు సాధించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.