ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో జరిగిన నాలుగో టెస్టును ఇంగ్లండ్ ఘనవియం సాధించింది. దీంతో సిరీస్ను 3-1తో దక్కించుకుంది. 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టపటపా వికెట్లు రాల్చుకుంది. మరో సారి బ్యాట్స్మేన్లు విఫలం అవడంతో సిరీస్ను సమర్పించుకున్నారు. ఫలితంగా 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
కెప్టెన్ విరాట్ కోహ్లి (58: 130 బంతుల్లో 4×4), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (51: 159 బంతుల్లో 1×4) అసాధారణ పోరాటంతో గెలుపుపై ఆశలు రేపినా.. మిగతా బ్యాట్స్మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో భారత్కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (0), శిఖర్ ధావన్ (17) మరోసారి వైఫల్యాల బాట కొనసాగించగా.. పుజారా (5) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. 22/3తో భారత్ ఒత్తిడిలో పడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (58), అజింక్యా రహానే(51) అర్ధ సెంచరీలతో ఆదుకునే ప్రయత్నం చేశారు. విలువైన భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ వారిద్దరూ ఔటయ్యాక మ్యాచ్ స్వరూపం మారిపోయింది. విరాట్ కోహ్లి – అజింక్య రహానె జోడి నాలుగో వికెట్కి అభేద్యంగా 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో గెలుపుపై భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ.. జట్టు స్కోరు 123 వద్ద విరాట్ కోహ్లి ఔటవగా.. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య (0), రిషబ్ పంత్ (18), ఇషాంత్ శర్మ (0), మహ్మద్ షమీ (8) క్రీజులో నిలవలేకపోయారు. రహానె కూడా జట్టు స్కోరు 153 వద్ద ఔటవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. చివర్లో అశ్విన్ (25) కాసేపు క్రీజులో నిలిచి ఓటమి అంతరాన్ని కొంచెం తగ్గించగలిగాడు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేయగా, భారత్ 273 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్లో 271 పరుగులు చేసి భారత్ ఎదుట 245 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో భారత్ బోల్తా పడి సరీస్ను సమర్పించుకుంది.