ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లి మరోసారి సఫారీ గడ్డపై జూలు విదిల్చాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ కోహ్లి (112: 119 బంతుల్లో 10×4) శతకం బాదడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విసిరిన 270 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత జట్టు 67 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో విరాట్ కోహ్లి-అజింక్యా రహానేలు అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ను మలుపుతిప్పారు.
అయితే ఈ జోడి మూడో వికెట్కు 189 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాపై వారి దేశంలో భారత్కు ఏ వికెట్కైనా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు 2001లో టెండూల్కర్-గంగూలీల జోడి జోహన్నెస్బర్గ్లో జరిగిన మ్యాచ్లో తొలి వికెట్కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.
అయితే ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశాన్ని కోహ్లి-రహానేల జోడి తృటిలో కోల్పోయింది. రహానే-కోహ్లిలు మరో ఐదు పరుగులు జత చేసి ఉంటే సచిన్-గంగూలీల రికార్డు బద్దలయ్యేది. ఇది సఫారీ గడ్డపై భారత్కు మూడో అత్యుత్తమ భాగస్వామ్యంగా ఉంది.