టీమిండియాతో వన్డే, టీ 20 సిరీస్లకు సంబంధించి ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్కు చోటు దక్కలేదు. ఈ మేరకు రెండు సిరీస్లకు సంబంధించి సోమవారం విడుదల చేసిన 15 మందితో కూడిన జట్టు నుంచి గేల్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కొంతకాలం విశ్రాంతి కావాలని గేల్ కోరడంతో భారత్తో సిరీస్తో పాటు బంగ్లాదేశ్తో సిరీస్కు కూడా అతన్ని పక్కను పెట్టేశారు.
ఈ నెల 21 నుంచి టీమిండియాతో ఐదు వన్డేల సిరీస్లో తలపడనున్న కరీబియన్ జట్టు ఆ తర్వాత నవంబరు 4 నుంచి మూడు టీ20ల సిరీస్లో ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో.. 15 మందితో కూడిన వన్డే, టీ20 జట్టుని క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రకటించింది.
రాజ్కోట్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో భారత్ చేతిలో వెస్టిండీస్ ఓడిపోగా.. రెండో టెస్టు మ్యాచ్ హైదరాబాద్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ టెస్టు ముగిసిన తర్వాత వన్డే సిరీస్ మొదలవుతుంది.
అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు ఇటీవల అక్కడికి వెళ్లిన క్రిస్గేల్ని వన్డే, టీ20 జట్టు నుంచి తప్పించిన సీడబ్ల్యూఐ.. అతని స్థానంలో ఓపెనర్ చంద్రపాల్ హేమ్రాజ్కి చోటిచ్చింది. అతనే కాకుండా.. ఫాస్ట్ బౌలర్ థామస్, ఆల్రౌండర్ అలెన్కి తొలిసారి వెస్టిండీస్ జట్టులో చోటు లభించింది.
వన్డే జట్టు పగ్గాలను జేసన్ హోల్డర్కి అప్పగించిన సీడబ్ల్యూఐ.. టీ20 జట్టు కెప్టెన్గా కార్లోస్ బ్రాత్వైట్ని నియమించింది. హిట్టర్లు డారెన్ బ్రావో,కీరన్ పొలార్డ్, ఆండ్రీ రసెల్కి కేవలం టీ20 జట్టులో మాత్రమే చోటు దక్కింది.
వన్డే జట్టు: జేసన్ హోల్డర్ (కెప్టెన్), ఆలెన్, సునీల్ ఆంబ్రిస్, బిషూ, చంద్రపాల్ హేమరాజ్, హెట్మయర్, షై హోప్, జోసెఫ్, ఎవిన్ లావిస్, ఆస్లే నర్స్, కీమో పాల్, పావెల్, కీమర్ రోచ్, మార్లోన్ శ్యామ్యూల్స్, థామస్
టీ20 జట్టు: కార్లోస్ బ్రాత్వైట్ (కెప్టెన్), ఆలెన్, డారెన్ బ్రావో, హెట్మయర్, ఎవిన్ లావిస్, ఓబెడ్, ఆస్లే నర్స్, కీమో పాల్, పైర్రే, కీరన్ పొలార్డ్, పొవెల్, దినేశ్ రామ్దిన్, ఆండ్రీ రసెల్, రూథర్పర్డ్, థామస్