ప్రస్తుతం భారత క్రికెట్ లో వికెట్ కీపర్ గా రాణిస్తున్న కేఎల్ రాహుల్ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ ఆరు వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాచ్ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో రిషబ్ పంత్ గురించి ప్రశ్నించగా.. దానికి రాహుల్ జవాబు ఇచ్చాడు.
రిషబ్ పంత్ రీ ఎంట్రీ తన చేతుల్లో లేదని.. అది టీమ్ మేనేజ్ మెంట్ చూసుకుంటుందని అన్నాడు. సెలెక్షన్ ప్రక్రియపై తాను మాట్లాడలేను అనే విధంగా వ్యాఖ్యానించాడు. వాస్తవానికి ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో వికెట్ కీపర్ రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో ఆ సిరీస్తోపాటు తాజాగా న్యూజిలాండ్లో జరుగుతున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్లోనూ రాహుల్ను కొనసాగించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. దీంతో పూర్తి ఫిట్గా ఉన్నప్పటికీ పంత్ రిజర్వ్కే పరిమితమయ్యాడు.
ఇంకోవైపు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసునిగా జట్టులోకి వచ్చిన 21 ఏళ్ల పంత్ తనకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. పంత్ ను కొనసాగించడంపై విమర్శలు వచ్చినప్పటికి పంత్ ను జట్టులో కొనసాగించింది యాజమాన్యం. తాజాగా రాహుల్ రూపంలో మంచి వికెట్ కీపర్ దొరకడంతో పంత్ ను పూర్తిగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.