ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఏబీ డివిలియర్స్ (72 నాటౌట్: 37 బంతుల్లో 4×4, 6×6), కెప్టెన్ విరాట్ కోహ్లి (70: 40 బంతుల్లో 7×4, 3×6) చెలరేగడంతో బెంగళూరు జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. యువ హిట్టర్లు రిషబ్ పంత్ (61: 34 బంతుల్లో 5×4, 4×6), అభిషేక్ శర్మ (46 నాటౌట్: 19 బంతుల్లో 3×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
ఢిల్లీ 16 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. పృథ్వీ షా (2), జాసన్ రాయ్ (12) ఇద్దర్నీ చహలే బౌల్డ్ చేశాడు. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 32; 3 ఫోర్లు), రిషభ్ పంత్ ఢిల్లీ ఇన్నింగ్స్ను నడిపించారు. 8వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులు దాటగా… పంత్ సిక్సర్ల ధాటికి 12వ ఓవర్లోనే స్కోరు వందకు చేరింది. 27 బంతుల్లోనే ఫిఫ్టీ (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసుకున్న రిషభ్… మొయిన్ అలీ బౌలింగ్లో నిష్క్రమించాడు. దీంతో 93 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే అయ్యర్ను సిరాజ్ ఔట్ చేశాడు. చివర్లో శంకర్ (21 నాటౌట్)తో కలిసిన అభిషేక్ శర్మ విరుచుకుపడటంతో భారీస్కోరు సాధ్యమైంది.
ఛేదనలో ఓపెనర్లు మొయిన్ అలీ (1), పార్థీవ్ పటేల్ (6) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లి – ఏబీ డివిలియర్స్ జోడి మూడో వికెట్కి అభేద్యంగా 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బెంగళూరు విజయానికి బాటలు వేశారు. అర్ధశతకం అనంతరం జట్టు స్కోరు 136 వద్ద కోహ్లీ ఔటవగా.. తర్వాత వచ్చిన మన్దీప్ సింగ్ (13), సర్ఫరాజ్ ఖాన్ (11) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకోవడంతో ఢిల్లీ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. అయితే ఆఖర్లో మళ్లీ డివిలియర్స్ దూకుడుగా ఆడి వరుస సిక్సర్లతో ఆరు బంతులు మిగిలి ఉండగానే గెలుపు లాంఛనాన్ని 187/5తో పూర్తి చేశాడు.